నా బంగారు త(చె)ల్లి

ఆగస్టు ఏడు (07/08).

స్రవంతి....పేరు మాత్రమే ప్రవాహం కాదు మాట కూడా ప్రవాహమే.తన నవ్వు ఒక ప్రవాహం.తన ప్రేమ ఒక ప్రవాహం. ఎంతో చలాకీగా,సందడిగా అందరినీ ఆట పట్టిస్తూ, అందరూ తన స్నేహితులే,అందరూ తన వారే అనుకునే మంచి మనసున్న అమ్మాయి. ఇంటిలో దేవి అని పిలుస్తాం. ఎందుకంటే,మంగళవారం మూల నక్షత్రంలో పుట్టిందని. పూర్తి పేరు స్రవంతీదేవి. అమ్మ అప్పట్లో కొత్తగా చేస్తున్న కరెంట్ ఆపరేషన్ చేయించుకున్న మూడేళ్లకు, ఆపరేషన్ కుదరక, మూడో సంతానంగా మా దేవి పుట్టింది. మాఅమ్మమ్మకు, అమ్మ,పెద్దమ్మ సంతానం అంతే. మా పెద్దమ్మకు అయిదుగురు ,మేము ముగ్గురం.అందరిలో మా దేవి చిన్నది.అందరు తనని  గారంగా చూసుకునేవారు. పన్నెండేళ్ళు వచ్చినా చక్కగా ఎత్తుకుని తిప్పేవారు. మా అందరి కన్నా చిన్నది కావటం వల్ల  ఒక వయసు వరకు పొట్టిగానే వుండేది.నాన్నగారు పొట్టి అని పిలవకుండా "ట్టిపో "  అనేవారు.తరవాత అదే మా అందరికన్నా పొడుగు అయ్యింది.పేరుకే నేను అక్కను.నా చెల్లి మాత్రం నాకు అమ్మ. నేను ఎప్పుడూ తనకి నోట్లో ముద్ద కలిపి పెట్టిన గుర్తులేదు.అందుకేనేమో, చివరిసారి నేను చేసిన పాయసం తిని వెళ్ళింది. నన్ను చంటిపాప లాగ చూసుకునేది.నేను కాలేజీలో  జరిగిన వన్నీ చెప్పేదాన్ని.ఓపిగ్గా వినేది.పుట్టినరోజుకి బట్టలు లేకపోయినా, chocalates లేకపోయినా ,ఒకటే అనేది. నా పట్టు లంగా వుందిగా అది వేసుకుంటాను అనేది.పేచీ పెట్టడం తెలియదు.అన్నిటికీ సర్దుకుపోయేది. కానీ,చాలా కోపం,చాలా ప్రేమ.ఉద్యోగంలో శివంగి లాగ భయపెట్టేది.
ఇంటిలో, డాడీ సినిమాలో పాప లాగ ముద్దు ముద్దుగా మాట్లాడేది.అమ్మ ఎంత కోపంగా పిలిచినా....
ఎంతో ముద్దుగా "ఏంటీ మమ్మీ" ....అనేది. ఆ మాట విని అమ్మ కోపం ఎక్కడికోపోయేది. అన్నయ్య,నేను అమ్మ అని పిలిచినా,తను మాత్రం మమ్మీ అనేది ఎందుకో మరి. నాకు ఒక అన్నయ్య,చెల్లి వున్నారు అని చెప్పుకోటానికే . వాళ్ళ జీవితాల్లో ముఖ్యమైన పెళ్ళి వేడుక నాకు చూసే భాగ్యం లేకపోయింది.కానీ, మా చెల్లి,మా ఇద్దరి వివాహాలు దగ్గర వుండి ఎంతో సంబరంగా చూసింది. పెళ్లయ్యాక,నేను కాస్త పెద్దమ్మాయిలాగ అన్నీ  తెలుసుకుని మసులుకోవాలి అనుకుని, బాధ్యతగా వుండేదాన్ని.దానికి,ఒకసారి దేవి,అమ్మ దగ్గర ఏడ్చేసింది,అక్క పెళ్లయ్యాక నాతో ఒక్క ముద్ద కూడా తినిపించుకొలేదని.పిచ్చి ప్రేమ. నాకు నాన్నమ్మ పేరు పెట్టారు.చెల్లికి అమ్మమ్మ పేరు పెట్టారు. మా అమ్మమ్మ నన్ను బాగా గారం చేసేది.నాన్నమ్మ లాగ అనుకుని. మా దేవి సరదాగా దెబ్బలాడేది.నన్ను లెక్క చెయ్యవు ,నేను అంటే నీకు అలుసు అని.బాగా ఆట పట్టించేది, అమ్మమ్మను. తను దూరమైన రోజు
 నుంచి అమ్మమ్మ కూడా భౌతికంగా మాతో వుంది అంతే.చివరి మనవరాలు,చిన్నదాన్ని ఎలా తీసుకుపోతావు అని కలవరిస్తూనే, రెండు సంవత్సరాలకే అమ్మమ్మ కూడా చెల్లి దగ్గరకు వెళ్ళిపోయింది. నా స్నేహితులతో,అన్నయ్య స్నేహితులతో ఎంతో బాగా కలిసిపోయింది.వాళ్ళకి తను అంటే చాలా ప్రాణం.నేను ఒక్కదాన్నే వుండటం,ఒంటరిగా వెళ్ళటం భయం.నాకు తోడు నా చెల్లే. తను దూరమై పుష్కరం పూర్తయ్యింది. ఇంకా నా చుట్టూనే వుంది అనే భావన. తను కనపపడలేదని 
మొదట్లో చాలా బాధ పడేదాన్ని, కానీ ఒక రోజు నా మనసుకు ఒక స్పందన కలిగింది.నేను ఎక్కడికి వెళ్ళలేదు, నీలోనే వున్నాను,నీతోనే వుంటాను.నువ్వు నవ్వుతూ వుండు, నీ నవ్వులో వుంటాను.నువ్వు ధైర్యంగా వుండు , నీ ధైర్యంలో వుంటాను.నన్ను నీలో చూసుకుంటూ వుంటాను.బాధ పడకు అక్క అని నా మనసు మాటలు చెప్పింది. ఇప్పటి నా అల్లరి ,చొరవగా మాట్లాడటం, సరదాగా వుండటం ఇవి అన్నీ నావి కావు.అవి నా దేవివి.నాలో అవి పెట్టి నన్ను సంతోషంలో వుంచుతూ, తనూ మనశ్శాంతిగా వుంటుంది.తనకు మేము అంటే ఎంత ఇష్టం అంటే, తన పేరు చెప్పి,బయట వాళ్ళకి భోజనాలు సరకులు ఇవ్వాలి అని , రెండు సార్లు కోన్నా సరే,ఇవ్వటం కుదరలేదు.
తరవాత సంవత్సరం మాపెద్దమ్మ మనవలకు,మా పిల్లలకు బట్టలు , chocalates కొంటె మాత్రం 
ఏ అడ్డంకీ ఇప్పటి వరకు రాలేదు.తనకి మేము అంటే అంత ఇష్టం అని అనుకుంటున్నాము.తను ఎక్కడ వున్నా,మా మనసుల్లో ఎప్పటికీ సజీవంగా వుంటుందని మాకు తెలుసు. మా చుట్టూనే వుంటూ,తను సంతోషంగా వుంటుంది.తను లేని ప్రపంచాన్ని చూపించటానికి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. అయిన,నా చెల్లి ఎప్పుడూ నాతోనే వుంటుంది. నా ఆనందాలను చూస్తూనే వుంటుంది. ఈ రోజు తన పుట్టినరోజు , నా మనసు సంతోషం కోసం తన గురించి కొన్ని మాటలైనా పంచుకోవాలని ఇలా రాస్తున్నాను. 

"బంధాలను పదిలంగా ఉంచుకోండి.
విలువగా చూసుకోండి.
బంధం విలువ దేనికి రాదు.
కోల్పోయిన బంధం తిరిగి రాదు."
✍️మళ్ళీ కలుస్తాను.

Comments

Popular posts from this blog

అ'తను'

ఆత్మీయుడు